Chiranjeevi: చేతికి కట్టు.. ఏం జరిగిందో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు చిరంజీవికి ఏమైందోనని కాసింత ఆందోళనకు గురయ్యారు. దీంతో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తనకు ఏం జరిగిందో, చేతికి ఎందుకు కట్టుకున్నారో వివరించారు.
అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ వివాహం సందర్భంగా మొదటి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలతో పాటు వివాహ ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. చాలా రోజుల తర్వాత అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకేసారి కనిపించంతో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఇదే సమయంలో చిరంజీవి చేతికి కట్టు ఉండటం గమనించి అభిమానులు ఆందోళన చెందారు.
ఆయనకు ఏమైందంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. అంతకు ముందు ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించినప్పుడు కూడా చేతికి కట్టుతో కనిపించారు మెగాస్టార్. నొప్పిని భరిస్తూనే ఎంతో ఓపికగా తన అభిమానులతో కలిసి సరదాగా ఫొటోలు, వీడియోలు దిగారు. దీంతో మెగాభిమానులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో చిరంజీవి స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ పెట్టారు.
చేతికి పట్టీ ఉండటం గమనించి పలువురు శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నా భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నా.
ఇప్పటికే నా రొటీన్ లైఫ్ కు తిరిగి వస్తున్నాను. ఈ విషయంలో ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సర్జరీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఆయన నైపుణ్యంతో ఆ ప్రక్రియ అంతా సజావుగా, సౌకర్యవంతంగా సాగింది. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, అందిస్తున్న దీవెనలకు మనసు ఎంతో సంతోషంగా ఉంది’ అని చిరంజీవి రాసుకొచ్చారు.
